ములుగు, బతుకమ్మ :
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బాగుండాలని సమ్మక్క సారలమ్మలను కోరుకున్నట్లు తెలిపారు. కాకతీయుల వంటి రాజులతో కొట్లాడిన వనదేవతలు సమ్మక్కసారలమ్మలు అని అన్నారు. వారి జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలని, గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులు అని కొనియడారు. వారి స్ఫూర్తితోనే మేము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. సామాజిక న్యాయం అందరికీ ఇప్పటికీ దక్కలేదని, ఈ పరిస్థితి పోయేలా జాగృతి తరఫున మా వంతు కృషి చేస్తామని కవిత అన్నారు.

