. . . రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన ఇందూరు మన మేయర్ నినాదంతో ముందుకెళ్దాం
. . . బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నరేంద్ర మోడీ వరుసగా గత మూడు ధపాలుగా ప్రధానిగా దేశాన్ని పరిపాలిస్తూ ఏమాత్రం అవినీతి లేని దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే సమక్షంలో నగరంలోని 22వ డివిజన్ నుండి మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తం, తాటికొండ రాము, ఆకుల శ్రీనివాస్, రాజ్ కుమార్, గౌత ఆనంద్, కుందన్ శ్రీనివాస్ లతో పాటు సుమారు 200 మంది డివిజన్ వాసులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన ఇందూర్ మన మేయర్ అనే నినాదంతో బిజెపి శ్రేణులు ప్రతి డివిజన్ లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటేనే బిజెపి పార్టీ అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఎంపీ అర్వింద్ జిల్లాలో చేస్తున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులై, మున్సిపల్ ఎన్నికలకు ముందు బిజెపి పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకే అందివ్వడం, అలాగే చిరు వ్యాపారులకు ముద్ర లోన్ పథకం కింద లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాలు అందివ్వడం, వాటి ద్వారా చిన్న, మధ్య తరగతి ప్రజలు స్వతహాగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఈ రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయనన్నారు. అదేవిధంగా కేవలం 14 రూపాయలతో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రెండు లక్షల జీవిత బీమా కల్పించడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో కచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ఈ చేరికల ద్వారా తనకు పూర్తి నమ్మకం కలుగుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 22వ డివిజన్ మహిళా మణులు రాబోయే రోజుల్లో బిజెపి వైపే తాముంటామని భరోసా కల్పించారు.

