. . . రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకంలో భాగంగా పట్టణ మహిళా సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సి ఈ ఓ దివ్య దేవరాజన్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అర్హులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మహిళ సంఘాలలో సభ్యులుగా లేని వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో రద్దీ లేకుండా చూడాలని తెలిపారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ చేపడతామని, అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భీంగల్ మున్సిపల్ పట్టణంలో 3686 స్వయం సహాయక సంఘాల సభ్యులకు, 1990 మంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాల మహిళలకు కలిపి మొత్తం 5676 ఇందిరమ్మ చీరలు మంగళవారం పంపిణీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదేవిధంగా జిల్లాలోని బోధన్ మున్సిపల్ పట్టణంలో సోమవారం వడ్డీ లేని రుణాలు పంపిణీ పూర్తి చేశామని, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ పట్టణాలలో మంగళవారం పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



