బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోల్కాల్ నిర్వహించి సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల పట్ల గౌరవం, బాధ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లోన్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, అవి ఆర్థిక ఇబ్బందులకు దారి తీసి తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగత ఆశయాలు, కుటుంబ విలువలపై దృష్టి పెట్టాలని, పిల్లల భవిష్యత్కు పునాది వేసేలా వ్యవహరించాలని సూచించారు. కుటుంబంతో సమయం గడపడం, శుభ్రమైన యూనిఫారం ధరించడం ద్వారా వృత్తి గౌరవాన్ని కాపాడాలని ఆదేశించారు.స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రైటర్ రూమ్లను పరిశీలించిన ఎస్పీ, పరిశుభ్రతతో పాటు కేసుల నమోదు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా అన్ని రికార్డులు నవీకరించాలని తెలిపారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, అవసరమైన చోట్ల అదనపు కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాన్సువాడ పట్టణ ట్రాఫిక్ పరిస్థితిని కూడా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, నిరంతర పెట్రోలింగ్, గస్తీ, అనుమానితులపై నిఘాతో నేర నియంత్రణ సాధించాలని ఎస్ఐలు, సిబ్బందికి ఆదేశించారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. గత ఏడాది శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది సమిష్టి కృషిని ప్రశంసిస్తూ అభినందించారు.ఈ తనిఖీలో డీఎస్పీ విట్టల్ రెడ్డి, బాన్సువాడ టౌన్ సీఐ శ్రీధర్, బాన్సువాడ రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

