జుక్కల్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. పంచాయతీ ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే ను పెద్ద కొడప్ గల్ మండలం బేగంపూర్ గ్రామస్తులు నిలదీశారు. శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యేను తమ ఊరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదని ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గ్రామంలోకి రావద్దని వెళ్లిపోండి అని మండిపడ్డారు. దానితో ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులపై కి దూసుకు వచ్చారు. అయినప్పటికీ గ్రామస్తులు ఎమ్మెల్యే వెళ్లిపోవాలని పట్టుబట్టారు.కార్యకర్తలకు గ్రామస్తులకు వాగ్వివాదం జరిగింది. గ్రామస్తులు తమను కొట్టేందుకు వచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. జుక్కల్ నియోజకవర్గంలో ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తుండడంతో ఏకంగా ఎమ్మెల్యే పై ఒక గ్రామ ప్రజలు నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
