పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం

0 6,973

 

. . . జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

బోదన్, బతుకమ్మ :

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. తొలి విడతగా బోధన్ డివిజన్ లోని మండలాలలో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో, ఆ డివిజన్ కు చెందిన  ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలకు బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమయ పాలనను పకాగా పాటిస్తూ, అప్రమత్తతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఆర్.ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ, నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అప్పుడే ఎక్కడ కూడా తప్పిదాలకు తావు లేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయగల్గుతారని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగినంత కోరం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకొని సదుపాయాలను పరిశీలించుకోవాలని, ఓటింగ్ కంపార్ట్ మెంట్, సిటింగ్ ఏర్పాట్లు తదితర వాటిని నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. శిక్షణా తరగతులలో సూచించిన అంశాలను ఆకళింపు చేసుకుని, విధిగా పాటించాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు “నోటా” సింబల్ ను కూడా తప్పనిసరిగా సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించి, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. శిక్షణ తరగతుల్లో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఏ.సీ.పీ రామారావు, డీ.ఎల్.పీ.ఓ, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు పాల్గొన్నారు.

 

All preparations are in place for the Panchayat elections

Leave A Reply

Your email address will not be published.