నిజామాబాద్, బతుకమ్మ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని తెలంగాణ జాగృతి రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు నవీన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఏప్రిల్ 22న కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు గోదావరి నీళ్లు చేరాయని, అవి కేవలం ఆ సంవత్సరం యాసంగి సీజన్ పంటలను కాపాడేందుకు మాత్రమే ఆ నీటిని ఉపయోగించారన్నారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ కు నీటిని తరలించాల్సిన అవసరం రాలేదన్నారు. 2023 జూలైలో ఎస్ఆర్ఎస్ పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా 2.50 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి ఎత్తిపోశారన్నారు. ఆ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన నీళ్లతో పాటు వరద నీళ్లు స్పెల్ వే గేట్ల ద్వారా గోదావరిలోకి.. ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను దాటుకొని బంగాళాఖాతంలోకి చేరాయన్నారు. ప్రశాంత్ రెడ్డి మాటలు ఎలా నిజమవుతాయని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఇరిగేషన్ చరిత్రలోనే అత్యంత అవినీతి మయమైందన్నారు. రూ.1,067 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు.. నాలుగేళ్లలోనే రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి నాయకుల అవంతి మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి నువ్వు రెండుసార్లు ఎలక్షన్లు గెలవడానికి కవిత కారణం కాదా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాకు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి నువ్వేం చేసావో చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత మాట్లాడింది ముమ్మాటికి నిజమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుదం రవిచందర్ శ్రీనివాస్ గౌడ్ విజయలక్ష్మి శేఖర్ రాజు గరురాజు మీసాల శంకర్ ఎండల ప్రసాద్ శ్రీనివాస్ గౌడ్ దొంత ప్రవీణ్ కుమార్ సాయి కృష్ణ ,శోభ, తదితరులు పాల్గొన్నారు.
