కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను సందర్శించిన కవిత
నల్గొండ, బతుకమ్మ :
జాగృతి జనం బాటలో భాగంగా నల్గొండ జిల్లాలో డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ ను జాగృతి అధ్యక్షురాలు కవిత సందర్శించి కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులను మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని తమ భూములను ఇచ్చారన్నారు. 2015 లోనే తొందరగా ప్రాజెక్ట్ పూర్తై ఉంటే సమస్యలు ఉండకపోయేవని, దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైందన్నారు. దీంతో అప్పుడు 18 ఏళ్లు నిండని చాలా మందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయని వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు చాలా తేడా ఉందని, అంతే కాకుండా నిర్వాసితులకు ఇళ్లు గానీ వేరే కాలనీలు కట్టించలేదన్నారు.ప్రభుత్వం వెంటనే నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని,లేదంటే ఇక్కడ యువతతో కలిసి హైదరాబాద్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ చేస్తామన్నారు.

