- వీవోఏల జీతం రూ.8వేల నుంచి రూ.26 వేలకు పెంచాలి
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, బతుకమ్మ : వీవోఏల హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా సిద్ధంమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో వీవోఏల ధర్నాకు గురవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు వీవోఏ లకు 26 వేలు జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. అసలు అధికారంలోకి వస్తామని వారికే నమ్మకం లేకుండే. అందుకే ఇష్టానుసారం హామీలు ఇచ్చారు. కానీ అనుకోకుండా తప్పుదారిన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలు గుర్తు లేవు. ఆయనకు ఒక్క సోనియమ్మ తప్ప తెలంగాణ సోయి లేదు. జై తెలంగాణ అనకుండా జై సోనియమ్మ అంటున్నాడు. సోనియమ్మ కాదు జీతాలు పెంచాలంటూ ధర్నా చేస్తున్న ఈ తల్లులను చూడాలని సీఎం ను కోరుతున్నా. 8 వేలు ఉన్న వీవోఏ ల జీతం రూ. 26 వేలు చేయాల్సిందే. వారి జీతం పెంచే వరకు వారికి జాగృతి అండగా ఉంటుంది. వీవోఏ లు ఎన్నో పనులు చేస్తారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలోని 64 లక్షల మందికి రూ.20 వేల కోట్ల రుణాలు అందించటంలో వీవోఏ లదే కీలక పాత్ర. ఈ ప్రభుత్వాన్ని జీతం పెంచమని

వేడుకోవాల్సిన అవసరం లేదు. పిడికిలెత్తి డిమాండ్ చేయాల్సిందే. వీవోఏ అక్కా చెల్లెళ్లు భయం భయంగా ఆందోళనలు చేయాల్సిన పని లేదు. ధైర్యంగా నిరసన తెలుపాల్సిందే. మీరు లేకుంటే 64 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలో మహిళలు ఊరుకుంటారా? ఈ ప్రభుత్వం నడుస్తదా?. మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీరు చేస్తున్న పనికి మాత్రమే సరైన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇంత పనిచేస్తున్న మనకు ఎందుకు యూనిఫాం లేదు? ఏడాదికి కచ్చితంగా రెండు జతల యూనిఫాంలు ఇవ్వాల్సిందే. యూనిఫాం ఉంటే ఆ గౌరవం వేరే ఉంటుంది. మనం కోరుకుంటున్నది ఆత్మగౌరవం, సరైన వేతనం మాత్రమే. మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే వారికి అండగా నేను ఉంటా. జీతం పెంచుతామని ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నా. ఈ ప్రభుత్వం వీవోఏ ఆడబిడ్డలను మాత్రమే కాదు. తెలంగాణలోని అందరూ మహిళలను మోసం చేసింది. వారికి ఇస్తా అన్న రూ. 2500 లేవు. పెన్షన్ పెంపు ఇప్పటికీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్నవాళ్లకు మాత్రమే ఇళ్లు ఇస్తున్నారు. తెలంగాణలోని ప్రతి పేదవారికి ఇళ్లు ఇవ్వాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి, మతిమరుపు, మోసపూరిత ప్రభుత్వం. అందుకే మన డిమాండ్ల కోసం గట్టిగా అడగాల్సిందే. వీవోఏ లు ఎలాంటి కార్యాచరణ తీసుకున్న సరే నేను ముందుంట. వీవోఏ ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా’’ అని అన్నారు.

