- పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు గురువారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్యను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయం ఎదుట కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ నిజామాబాద్ ఇంచార్జి బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే వాటికి అనుగుణంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లుందకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరినీ అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్ధూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, శేఖర్ గౌడ్, ఎన్ ఎస్ యుఐ నాయకులు వేణురాజ్, రామర్తి గోపి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

