- సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు
బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు బుధవారం బోధన పట్టణంలోని ప్రభుత్వ బాలికల, బాలుర వసతి గృహలను తనిఖీ చేశారు. ఆచన్ పల్లలో గల జ్యోతిభా పూలె బాలికల పాఠశాల, వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వంటశాలకు వెళ్లిన జడ్జి ఆహార పదార్ధాలను పరిశీలించారు. పరిశుభ్రతను మెరుగు పరచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను గమనించారు. విద్యార్థినులకు ఏర్పాటు చేసిన వసతులను, తరగతి గదులను పరిశీలించి భద్రత వసతులను అధ్యయనం చేశారు. విద్యార్థినులను కలిసి చదువు గొప్పతనాన్ని వివరించారు. లక్ష్యంతో చదువుతె ఉన్నత శిఖరాలకు చేరవచ్చని ఎరుక జేశారు. పూలె దంపతుల జీవితమే ఆదర్శంగా విద్య భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని అన్నారు. చదువులో విషయ పరిజ్ఞానం గూర్చి ఉపాధ్యాయులను అడిగి సందేహాలను తీర్చుకోవాలని సూచించారు. అనంతరం బెల్లల్ గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల, వసతి గృహలను పరిశీలించారు.కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు వసతుల కల్పనలో, భోజన నాణ్యతలో రాజీ పాడబోమని ప్రిన్సిపాల్ తెలియజేశారు. విద్య బోధనలో ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని, కంటికి రెప్పలా చూసుకుంటున్నామని ఆయన తెలిపారు.పాఠశాల, వసతి గృహలను కలియ తిరిగిన జడ్జి ఉదయ్ భాస్కర్ రావు విద్యార్థులను వసతుల కల్పన ఎలా ఉందంటూ వాకబు చేశారు. తరగతి గదిలోనే నిద్రిస్తున్నామని, ఇరుకుగా ఉన్న తరగతి గదిలో నిద్రించడం కష్టంగా ఉన్నదని విద్యార్థులు తెలిపారు.పాఠశాల, వసతి గృహల తీరుతెన్నులపై సమగ్ర నివేదిక రూపొందించుకుని ఉన్నత న్యాయస్థానంకు నివేదిస్తామన్నారు. జడ్జి వెంట న్యాయసేవ సిబ్బంది శ్రావణ్,మృళా నిని,పారా లీగల్ వాలంటీర్స్ పద్మ సింగ్, రమణ రెడ్డి, న్యాయవాది ఆశ నారాయణ ఉన్నారు.

