- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- జాగృతిలో బీసీ నాయకుడు రామ్ కోటి చేరిక
హైదరాబాద్, బతుకమ్మ : జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది… అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతి లో చేరారు. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రామ్ కోటి తో పాటు 350 మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతి లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూ.2500 నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది.. అడబిడ్డలకు కిట్ ల సాధన కోసం ప్రభుత్వం పై కొట్లాడాలని అన్నారు. పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇయ్యలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలన్నారు. ఒక్కటి కాదు రెండు కాదు అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దాం అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.


