బతుకమ్మ, నిజామాబాద్
ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు తరలిస్తున్న 319 కిలోల గంజాయి దాదాపు కోటి విలువ చేసే కేసులో భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మందిని అరెస్టు చేయగా అందులో ప్రధాన సూత్రదారిగా నిజామాబాద్ కు చెందిన ఎంఐఎం నేత మునావర్ ఆలీని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోటి విలువ చేసే గంజాయి కేసులో పది మంది నిందితులను అరెస్టు చేసి వారి రెండు కార్లను, మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గంజాయి కేసులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ళ సదయ్య, అతని భార్య అపర్ణ, కుమారుడు అఖిల్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారికి 2017 నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మునావర్ ఆలీ సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. మునావర్ ఆలీపై 2013 నుంచి 2017 వరకు నిజామాబాద్, వరంగల్, విజయవాడ, మహారాష్ట్ర , పాట్నా, పశ్చిమగోదావరి జిల్లాలో గంజాయి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇదే కేసులో మరో ప్రధాన నిందితుడు అయిన హైదరాబాద్ లోనిబేగం బజార్ కు చెందిన దత్తు పంచాల్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
