- అడవి పందుల సంచారం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన రాశి వనం ఇప్పుడు స్థానిక ప్రజలకు ఆందోళనకు కారణమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా పాలనాధికారి మార్గదర్శకత్వంలో అప్పటి ఎల్లారెడ్డి ఆర్డీఓ మొక్కలపై ప్రత్యేక అభిరుచి కనబరచి అనేక రకాల మొక్కలను నాటించి వాటి సంరక్షణ బాధ్యతలు స్వయంగా చూసుకున్నారు. అయితే ఆయన పదవీ విరమణ తర్వాత సంరక్షణ లేకపోవడంతో రాశి వనం ఇప్పుడు ఘనమైన అడవి వాతావరణంగా మారింది. మునుపటి వరకు పట్టణ ప్రజలు ఉదయాన్నే ఇక్కడ వాకింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు అక్కడ రెండు అడవి పందులు నివాసం ఏర్పరచుకోవడంతో ప్రజలు, విద్యార్థులు భయంతో ఆ ప్రదేశంలోకి వెళ్లడం మానేశారు. అప్పుడు మేము ఇక్కడ వాకింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు అక్కడికి వెళ్లడం భయంగా ఉంది. మా పిల్లలు కళాశాలకు వెళ్తారు. వాళ్ల భద్రత కోసం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంత నివాసులు అటవీ శాఖ, విద్యాశాఖ, మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పందులను పట్టుకుని వేరే ప్రదేశానికి తరలించాలని, రాశి వనానికి ఫెన్సింగ్, లైటింగ్ ఏర్పాటు చేసి మళ్లీ ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.
