- పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : చట్టాలకు లోబడి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అహర్నిశలు పని చేస్తుందని నిమజ్జనం సంధర్బంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని కమాండో కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పోలీస్ శాఖ ఏ పార్టీ కో, ఏ వ్యక్తికో తొత్తుగా వ్యవహరించదని అన్నారు. సోషల్ మీడియాలో పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజే లను నిషేధిస్తూ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటే దీనిని తప్పుగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు. మరోసారి పోలీసులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా చట్టపరంగా వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రతినిధులు చందూలాల్, సాయిలు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
