24.7 C
Hyderabad
Monday, August 3, 2026

12లోగా నివేదిక అందజేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో కురిసిన అధిక వర్షాల వలన జరిగిన నష్టానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 12వ తేదీలోగా  రిపోర్ట్ అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  శనివారం జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ లు, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, హౌసింగ్, పంచాయతీ, ఆర్ డబ్లూ ఎస్, విద్యుత్, మున్సిపల్  ఇతర శాఖల అధికారులతో టెలికాన్ట్రెన్స్ నిర్వహించి మాట్లాడుతూ  ఈనెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  పర్యటన సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరదల నియంత్రణకు శాశ్వత పరిష్కారాలను చూపాలని  ఆదేశించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వరదలు సంభవిస్తే  నష్టం తీవ్రత తగ్గించేలా  ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టాలని  ఆదేశించారన్నారు. శాశ్వత పరిష్కారం కోసం  లోతట్టు ప్రాంతాలు, ఈమధ్య  అధిక వర్షాలతో దెబ్బతిన్న  పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని కాలనీలో, ఆవాసాలలో వరద తీవ్రత రావడానికి కారణం గుర్తించి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. సీఎం ఆదేశించిన విధంగా జిల్లాలో  వరదలతో దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించేందుకు  వెంటనే చేయవలసిన పనులకు మరియు శాశ్వత పనులకు మరొకసారి ప్రతిపాదనలు సమర్పించాలని  అన్నారు.  డివిజన్ స్థాయిలలో  సబ్ కలెక్టర్/ ఆర్డిఓ ల నేతృత్వంలో కమిటీని  పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్,  మండల స్థాయి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో  కమిటీ వేస్తున్నామని ఆ కమిటీ  అయా డివిజన్లలో  పర్యటించి అధిక వర్షాల వలన  దెబ్బతిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు,  రహదారులు, పంట చేలు, గృహాలు, వరద బాధిత గ్రామాలు, కాలనీలను సందర్శించి అధిక వర్షాల సమయంలో  వచ్చిన వరదలతో ముంపుకు గురవ్వడానికి మరియు ఆయా  వనరులు దెబ్బతినడానికి  గల కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో అధిక వర్షాలు వచ్చిన తీవ్ర నష్టం సంభవించకుండా శాస్త్రీయంగా సలహాలు సూచనలు అందించాలని అన్నారు. అదనంగా కల్వర్టులు, చెక్ డ్యామ్ లు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. కామారెడ్డి పట్టణం మరియు రాజంపేట మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువ ఉందని అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా  స్టడీ చేయాలని అన్నారు. ఆక్రమణలను స్వాధీనం చేసుకోవడం, అక్రమ నిర్మాణాలను తొలగించడం లేదా రిపోర్ట్ చేయాలని అన్నారు. ఈనెల 12వ తేదీలోగా  రిపోర్ట్ అందజేయాలని అన్నారు. జిల్లా స్థాయి ప్లడ్ మేనేజ్మెంట్  కమిటీలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి , ఏసీ ఎల్బి, సీఈ ఇరిగేషన్ మరియు డివిజన్ స్థాయిలో లాగానే జిల్లా స్థాయిలో కూడా సంబంధిత అధికారులు కమిటీలు ఉంటారని ఏసి రెవెన్యూ కన్వీనర్ గా ఉంటారని తెలిపారు. బాధితులకు వివిధ ఎన్జీవోలు అందించే  రిలీఫ్ మెటీరియల్ ఎక్కువ నష్టం వాటిని ప్రాంతాల్లో  సరిగా అందేలా చూడాలని అన్నారు. ఇసుక మేటల వలన దెబ్బతిన్న పంటల వివరాలను డిఆర్డిఓ ఆధ్వర్యంలో  మండల స్థాయి అధికారులు వ్యవసాయ అధికారులు  సేకరించి గ్రామ సభలో చర్చించి అందించాలని, జిల్లావ్యాప్తంగా  దెబ్బతిన్న దాదాపు 1600 ఇండ్లను పరిశీలించి అర్హత ఉన్నవారికి  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం  కోసం ప్రపోజల్ చేయాలని  ఆదేశించారు.  ఈ టెలి కన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు వీణ, పార్థ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article