హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం జోరుగా సాగుతోంది. వేలాది విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. నగరంలో దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం చేస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో అధికారులు, పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వినాయక విగ్రహాలు వెళ్లే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం లేదు. నగరంలో ఆదివారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. నగరంలోకి లారీలకు ప్రవేశం లేదని పేర్కొన్నారు. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి శనివారం ఉదయం హైదరాబాద్లోని ఎంజీబీఎస్కు వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివారు ప్రాంతాలకే పరిమితం చేయనున్నారు. శంషాబాద్ మీదుగా బెంగళూరు, మహబూబ్నగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఆరాంఘర్ వద్దనే నిలిపివేయనున్నారు. వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఉప్పల్ వద్ద, విజయవాడ, నల్లగొండ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను ఎల్బీనగర్ వద్ద నిలిపివేయనున్నారు. వికారాబాద్, మొయినాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మెహిదీపట్నంకు పరిమితం చేయనున్నారు. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్లో నిలిపివేయనున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు.

