- ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : ప్రజలకు రక్షిత నీటిని అందించే లక్ష్యంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన పథకాలు గాడి తప్పుతున్నాయి. ఆరోగ్యకరమైన తాగునీటిని అందించాల్సింది పోయి అపరిశుభ్ర నీటిని సరఫరా చేస్తున్నాయి. నీరు నిల్వ చేసే ట్యాంకులను నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని 9 వ వార్డులో గల శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి, పెచ్చులు ఊడిపోయి, ఇనుప చువ్వలు బయటకు దర్శనమిస్తున్నాయి. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని కాలనీవాసులు తీవ్ర భయందోలనకు గురవుతున్నారు. ఈ శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ గురించి అధికారులు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఈ వాటర్ ట్యాంక్ కు గత ఇదేళ్ల నుండి మెట్లు కూడా లేవని, అధికారుల పర్యవేక్షణ లోపంతో కలుషితమైన త్రాగునీరు వస్తుందని, ఈ నీరు త్రాగడం వలన రోగాల భారిన పడుతున్నామని కాలనీవాసులు తీవ్రంగా మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ పై దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
