- ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలం
- లోతట్టు ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు సహకరించాలి
- మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిండుగా ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలు, నిండిన చెరువుల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. గురువారం ఆయన బతుకమ్మ తో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో ఏర్పడ్డ తీవ్ర పరిస్థితులు, ప్రజల పడ్డ ఇబ్బందులను మనమందరం చూసాం. కామారెడ్డి బారీ వర్షాలతో నిండిన నిజాం సాగర్ పూర్తి స్థాయిలో నిండి సుమారు 2 లక్షల క్యూసెక్కులకు పైగా గోదావరిలోకి నీరు వస్తున్న నేపథ్యంలో, జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షాల దారిమిల ఇప్పటికె ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీళ్లను వదిలారన్నారు. ఎస్సారెస్పీకి ఇంకా తీవ్ర వరద పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు గట్టు వెంట మోటార్లు ఉంటే ముందే తీసుకొని గట్టు వెంబడి వెళ్లకుండా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బాల్కొండ నియోజకవర్గం లో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున ఈ వాగుల పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతల ప్రజలకు బీయర్ ఎస్ శ్రేణులు అందుబాటులో ఉంటూ అవసరమైన చోట ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని, అవసరమున్న చోట భోజన వసతులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ బారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో ఏర్పడ్డ తీవ్ర ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ముందస్తు ప్రణాళిక లేక ప్రభుత్వం ప్రజలను, యంత్రాంగంను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. ఇకనైనా నిజామాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారం యంత్రాంగన్ని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
