- జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రదేశంలో చెరువు వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. ప్రధాన రహదారి నుండి చెరువు వరకు గల రోడ్డును, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశంలోని వసతులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రదేశంలోని హెచ్.టీ లైన్ విద్యుత్ స్తంభాలను తొలగించి, సురక్షిత ప్రాంతంలో అమర్చాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్, నీటిలో మునిగి గల్లంతు కావడం, రోడ్డు ప్రమాదాలకు గురి కావడం వంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. పోలీస్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
