బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా సరస్వతి నగర్ కాలనీ నీటమునిగిపోయింది. రాత్రి వేళ వర్షం కారణంగా పలు కాలనీల్లోని రహదారులన్నీ మురుగు నీటితో నిండిపోయాయి. స్థానికులు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కాలనీలో సక్రమమైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. వర్షపు నీరు బయటకు వెళ్లకపోవడంతో వీధులు మొత్తం మురుగునీటితో నిండిపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. నీరు నిల్వ ఉండడంతో దోమలు బెడదతో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు సమస్యను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోయారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి అని, తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

