- మద్నూర్ తాహసిల్దార్, ఎస్సై
మద్నూర్, బతుకమ్మ: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ తహశీల్దార్ ఎం.డి. ముజీబ్, ఎస్సై విజయ్ కొండ కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేశ్ మండపాల సభ్యులతో నిర్వహించిన శాంతి యుత కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని గణేష్ మండపాలను నిర్వహించేవారు శాంతియుతంగా, మత సామరస్యంగా నిర్వహించాలని సూచించారు. నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకొని, పోలీసు అధికారుల నిబంధనలు పాటించాలన్నారు. మండపంలో ఇద్దరు వ్యక్తులు తప్పకుండా ఉండాలని తెలిపారు. విద్యుత్ సదుపాయం కొరకు తప్పనిసరిగా విద్యుత్ అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవాలలో డీజే సౌండ్ ఉపయోగించరాదని, మద్యం సేవించరాదని, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు పోలీసు అధికారులకు సహకరించాలని, కలిసిమెలిసి శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గణేష్ మండప నిర్వాహకులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది విద్యుత్, అగ్నిమాపక శాఖ తదితరులు పాల్గొన్నారు.

