వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తర్ ఖండ్ రాష్ర్టం హరిద్వార్లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. ఉదయం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గుడి దగ్గర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు భక్తులు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు గర్హ్యాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
మెట్ల వద్ద విద్యుత్ షాక్ కారణంగా…
ప్రాథమిక సమాచారం ప్రకారం మానసాదేవి ఆలయం మెట్ల వద్ద ఈ ఘటన జరిగింది. మెట్ల వద్ద విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు. విద్యుత్ షాక్ కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
