హైదరాబాద్, బతుకమ్మ : సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు అనుమతి లభించింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు. వేసవి సెలవులు ముగిసే లోపు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ పక్షాన ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు పదేపదే ప్రాతినిధ్యాలు ఇచ్చారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ని, విద్యాశాఖ కార్యదర్శిని, డైరెక్టర్ని కలిసి బదిలీలు, పదోన్నతులు జరపాల్సిన అవసరాన్ని వివరించారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయలేదు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ యూస్పీసీ ప్రతినిధులు దశలవారీ పోరాటానికి నిర్ణయించి జులై 14 న సిఎస్, విద్యాశాఖ కార్యదర్శి గార్లను కలిసి నోటీసు ఇచ్చారు. ఈనెల 23,24,25 తేదీల్లో అన్ని మండలాల్లో తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. ఆగస్టు 1 న జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు ఉపాధ్యాయులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదోన్నతులపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవటం సంతోషం. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావలసి ఉన్నాయి. వాటికోసం యూఎస్పీసీ పోరాటం కొనసాగుతుంది.
