నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలతో పాటు, అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందేలా చూడాలని ఆదేశించారు. గురుకులంలో 640 మంది విద్యార్థినులు ఉండగా, వారికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం

అందించాలని కలెక్టర్ సూచించారు. మెనూను పరిశీలించి, తదనుగుణంగా ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. అనంతరం ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీలో చిన్నారుల హాజరు, వారికి అందిస్తున్న పౌష్టికాహారం, నేర్పిస్తున్న ఆటపాటల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు కోడిగుడ్డు అందించాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కింద పనులు పాక్షికంగా చేపట్టి, అర్ధాంతరంగా నిలిపి వేయడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే వాటిని పూర్తి చేసి తరగతి గదుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థుల నమోదుతో పాటు క్రమం తప్పకుండా వారు బడికి వచ్చేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు.

