- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : విద్యార్థులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు ఆన్ అకాడమీ పేరు తో జే.ఈ.ఈ మెయిన్స్, నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ తరగతులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి రోజూ 2 గంటల పాటు ఆన్ లైన్ కోచింగ్ తరగతుల్లో శిక్షణ తీసుకొని పోటి పరీక్షలకు సన్నద్దం కావాలని అన్నారు. మనకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. పిల్లల ఆంగ్ల భాష స్కిల్ పెంచెందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి తరువాత విద్యార్థులకు మెడికల్ సైడ్ ఆసక్తి ఉంటే నీట్ శిక్షణ, ఇంజనీరింగ్ ఆసక్తి ఉన్న విద్యార్థులకు జేఈఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ తెలిపారు. గతంలో జిల్లాలోని 13 కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆన్ అకాడమీ పేరు తో నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తరగతులను ప్రారంభించి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగిలిన 26 రెసిడెన్షియల్ పాఠశాలలో శిక్షణ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 నుంచి 12వ తరగతులు విద్యార్థుల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రెగ్యులర్ అకాడమిక్ తో పాటు అదనంగా నేర్చుకోవాలని,ఈ తరగతుల వల్ల భవిష్యత్తులో పోటీ పరీక్షలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ సూచించారు.

- వంట గది, స్టాక్ రూం తనిఖీ..
అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని వంట గది, డైనింగ్ హాల్, స్టాక్ రూమ్ లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డి.డబ్ల్యు.ఓ లక్ష్మీరాజం, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

