- కామారెడ్డి డీఎఫ్ఓ నిఖిత
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఎల్లంపేట్ బీట్ పరిధిలో పులిని వేటాడేందుకు యత్నించిన నలుగురు స్కూల్ తాండా వాసులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందని కామారెడ్డి డిఎఫ్ఓ బి.నిఖిత తెలిపారు. మంగళవారం డిఎఫ్ఓ నిఖిత ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా పులి సంచారం ఉందని తెలిపారు. పులిని గుర్తించుటకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల స్కూల్ తాండాకు చెందిన భూక్య మహిపాల్ ఆవుల మందపై పులి దాడి చేసిందని తెలిపారు. దానితో భూక్య మహిపాల్, గంగావత్ కనీరాం, సలావత్ గోపాల్, పిపావత్ సంజీవ్ లు పులిని వేటాడేందుకు యత్నించారన్నారు. ఈ విషయంలో ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నలుగురిపై అటవీ యాక్ట్ సెక్షన్ తో పాటు పులిని వేటాడేందుకు యత్నించినందుకు రెండు సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
