నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్న రైతులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా గురువారం బైబ్యాక్ ఒప్పంద పత్రాలు అందజేశారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతులకు ప్రీ యునిక్ కంపెనీ తరపున ఈ పత్రాలను అందించారు. లాభదాయకమైన ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట సాగుకు ముందుకువచ్చే రైతులకు ప్రభుత్వ సబ్సిడీలతో పాటు, ఇతర అన్ని విధాల తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఇప్పటికే జిల్లాలో 5600 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారని, ఈ సంవత్సరం 1500 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట దిగుబడి చేతికి వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి జి.వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

