- రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా కే.సూర్యం, ఎస్ఎల్ పద్మ ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదమయ్యాయి. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్.ఆర్ భవన్ లో విలేకరులు సమావేశం నిర్వహించారు. నూతన కమిటీని టియుసిఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే.సూర్యం, ఎస్.ఎల్ పద్మ లు మాట్లాడుతూ టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభలు నిజామాబాదులో జూన్ 21, 22 తేదీలలో విజయవంతమయ్యాయన్నారు. మహాసభల జయప్రదం కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా వివిధ రంగాల కార్మికులకు రాష్ట్ర కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. టీయూసీఐ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా కే.సూర్యం, రాష్ట్రం కార్యదర్శిగా ఎస్.ఎల్ పద్మ ఉపాధ్యక్షులుగా ఎం.నరేందర్, ఎం.హన్మేష్, జీ.రామయ్య, కే.రాజన్న, సీ.వెంకటేష్, సహాయ కార్యదర్శిగా ఎం.వెంకన్న, ముత్తన్న, వి.ప్రవీణ్, అరుణ్ కుమార్, యాకుబ్ షావలి, కోశాధికారిగా కిరణ్ లను రాష్ట్ర కమిటీ సభ్యులుగా 26 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతున్న, ఎదుర్కొంటున్న సమస్యల పైన తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా మహాసభ భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించి ప్రకటించింది. జూలై 9 న కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సంస్థ నుండి అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చింది. జూలై 31వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పైన, కనీస వేతనం 26వేలు చెల్లించాలని, కనీస పెన్షన్ 9వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాన్ని అమలు చేయాలని, తదితర డిమాండ్లపై జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రెస్ మీట్ లో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, సహాయ కార్యదర్శులు , ఎం.ముత్తెన్న, ఎం.వెంకన్న జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేశ్వర్, మల్లేష్, జిల్లా నాయకులు కిరణ్, రవి, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

