బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో, 12వ బెటాలియన్ సౌజన్యంతో జూన్ 21 వ తేదీ శనివారం రోజున ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన 12వ బెటాలియన్ సర్దార్ అనూజ్ రానా మాట్లాడుతూ, యోగా అనేది భారత ప్రాచీన సంపదగా పేర్కొన్నారు. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు యోగా ముఖ్య భూమిక వహిస్తుందన్నారు. విద్యా వికాస్ కళాశాల నిర్వాహకులు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో మానవులు శారీరక, మానసిక ఒత్తిడులకు గురవుతున్న నేపథ్యంలో యోగా మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు. గురుకుల పద్ధతుల్లో ఋషులు, మునులు ఆచరించిన యోగ విధానాలే ఈనాటి అవసరమని, ప్రతివారూ రోజూ కనీసం కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూర్, మాతృశ్రీ, మాట్రిక్స్, రుద్రూర్ మోడల్ స్కూల్ల ఉపాధ్యాయులు బి.సాయిలు, నాగేశ్వరరావు, రాజశేఖర్, బలరాం, షహేంద్రనాథ్ పాల్గొన్నారు. విద్యార్థులు యోగాసనాలు ప్రదర్శించి ఉత్సాహం కనబర్చారు.

