. . . జెఏసి హెచ్చరిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
వక్ఫ్ చట్టంను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల భాగంగా వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష నిర్వహించబడింది.ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు గైనీ గంగారాంలు మాట్లాడుతూ….

వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది ముస్లింల మత, సామాజిక, సాంస్కృతిక హక్కుల పై నేరుగా దాడి చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం అసహనానికి దారితీస్తోందని తెలిపారు.లౌకిక భావన కలిగిన మిత్రులు, మేధావులు ఈ ఉద్యమంలో భాగస్వాములై మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం మతపరమైన పోరాటం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకు సాగిస్తున్న నైతిక, జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు, ఇతర లౌకిక రాజకీయ పార్టీలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

