. నిజామాబాద్ నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో ఘటన
. వైద్యల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త ఆరోపణ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వెన్ను నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన మహిళ వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత కన్నుమూసింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని ప్రతిభ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
వేల్పూర్ మండలం పడిగల్ గ్రామానికి చెందిన రాధిక(35) వెన్ను నొప్పితో బాధపడడంతో ఆమెను భర్త సురేశ్.. ప్రతిభ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. రాధికకు వెన్నుపూస ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలపడంతో సురేశ్ ఒఫ్పుకున్నాడు. గురువారం ఉదయం ఆపరేషన్ పూర్తి చేశారు.
ఆ తరువాత ఆమెను వెంటిలేటర్ పై ఉంచగా శుక్రవారం ఉదయం మృతి చెందింది. సుమారు ఏడు గంటలపాటు వైద్యులు ఆపరేషన్ చేసి తన భార్యను వెంటిలేటర్ పై వేశారని, వారి నిర్లక్ష్యం కారణంగానే రాధిక మృతి చెందిందని ఆమె భర్త సురేశ్ ఆరోపించాడు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్దకు చేరుకున్న బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు.
