- బిఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది
- పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, బతుకమ్మ : ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేటీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డిని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని అన్నారు. కవిత ఎపిసోడ్ ను డైవర్ట్ చేయడానికి కేటీఆర్, సీఎం రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. పది సంవత్సరాల టిఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయని అన్నారు. కాలేశ్వరం అవినీతిలో కెసిఆర్ కు నోటీసులతో కేటీఆర్ భయపడుతున్నాడని అన్నారు. బిఆర్ఎస్ కు, బిజెపికి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. బిఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందన్నారు. కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదును కోసం హరీష్ రావు ఎదురు చూస్తున్నాడని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో కెసిఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని తెలిపారు. కేసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుందని అన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బిఆర్ఎస్ ఉండదని అన్నారు.
