- వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు.. ఎవరిపై ప్రేమ లేదు..
- లేఖ బహీర్గతం కావడం బాధాకరం
- శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : కేసీఆర్ దేవుడు.. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి.. వారి వల్ల నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి అమెరికా వెళ్లి తిరిగివచ్చిన సందర్భంగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయిందని హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాయడం జరిగింది. గతంలో కూడా లేఖ ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే చెప్పాను. ఇప్పుడు లేఖ బహీర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహీర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ కూతురైన నేను రాసిన లేఖనే బయటికి వచ్చిందటే… పార్టీలో ఇతర సామాన్యుల పరిస్థితి ఏమిటి..?. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. లేఖ బహీర్గతం కావడం బాధాకరం. లేఖ బహీర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆర్ యే…. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా మందుకెళ్తుంది. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయి… వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం’’ అని తెలిపారు.

