- రెచ్చిపోతున్న నల్లమట్టి మాఫియా
- ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. తరలింపు
- వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
- శాఖల వారీగా మామూళ్ళు
నిజామాబాద్, బతుకమ్మ: నల్ల మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రైతుల పేరుతో అనుమతులు ఓ చోట తీసుకుని మరో చోట యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రైతుల పేర్లపై కాంట్రాక్టర్లు నల్ల మట్టి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. నల్లమట్టి వ్యాపారంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అల్లుడి వరుసయ్యే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అతగాడి అండ చూసుకుని నిబంధనలను గాలికొదిలేస్తున్న వ్యాపారులు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో నల్ల మట్టిని ఊర్లు దాటిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన యథేచ్ఛ గా తవ్వకాలు కొనసాగు తున్నాయి. అనుమతులు ఇచ్చి ప్రాజెక్టు అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు చేతులు దులుపుకుంటు న్నారు. మట్టి తవ్వకాలపై ఎలాంటి పర్య వేక్షణనిఘా లేదు. ఓవర్ లోడ్ తో మట్టి తరలిస్తున్నా రెవెన్యూఆర్టీఏఆర్ అండ్ బీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండగా, స్థానిక పోలీసులు సైతం చూసీ చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్ల మట్టి మాఫి యాకు రాజకీయ అండదండలు ఉండటంతో స్థానికులు కూడా అడ్డు చెప్పేందుకు జంకుతు న్నారు. ప్రాజెక్టులో పదుల సంఖ్యలో పొక్లెయిన్ లను పెట్టి వందల సంఖ్య లో టిప్పర్లు ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. నందిపే ట్, మాక్లూర్ ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ మట్టి తరలింపు తో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మట్టి తరలింపు లో కాంట్రా క్టర్ల ఆగడాలు నియంత్రించా లని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడీసీలకు డబ్బులు ఇచ్చి ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

- సీజ్ చేసినా మారని తీరు
నల్ల మట్టిని భారీ లోడింగ్ తో తరలిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దూర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారనే ఫిర్యాదు ల మేరకు ఆర్టీఏ అధికారులు సోమవారం వరకు 20 టిప్పర్లను సీజ్ చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. నందిపేట ప్రాంతం నుంచి నిర్మల్ జిల్లా లోస్రా మండలానికి నల్ల మట్టిని తరలిస్తున్నారు. అయితే కిలో మీటర్ల ఆధారంగా నల్ల మట్టి లోడ్ కు డబ్బులు వసూలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఒక్కో లోడ్ కు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. నల్లమట్టి తరలింపునకు సహకరిస్తున్న పోలీసు, రవాణా శాఖ, నీటి పారుదల శాఖాధికారులకు వాటాలు అందిస్తున్నామని బాహాటంగానే చెబుతున్నారు. రవాణా శాఖ ఓవర్ లోడ్ వాహనాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఒక్కో టిప్పర్ రూ.2 వేలు వసూల్ చేశారన్న ఆరోపణలున్నాయి.

- గ్రామం దాటాలంటే వీడీసీకి ఇవ్వాల్సిందే
ఎస్సారెస్పీలో ఇష్టారాజ్యంగా నల్లమట్టిని తవ్వి తరలిస్తున్న వ్యాపారులు అడుగడుగునా అధికారులను, గ్రామాల వీడీసీలను పైసలతో ప్రసన్నం చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రమాదకరంగా టిప్పర్లు, ట్రాక్టర్లు వెళ్తున్నా పట్టించుకోని పలు గ్రామాల వీడీసీలు తమ గ్రామాన్ని దాటి వెళ్లాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనంటూ వసూలు చేస్తున్నారు. నల్ల మట్టి వ్యాపారులు ఆయా గ్రామాల వీడీసీలకు అడిగినంత ఇచ్చుకుని మట్టిని ఏ అడ్డంకులూ లేకుండా తరలిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

- ఉచితంగా తీసుకునేందుకు అనుమతించాం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సిల్ట్ (నల్ల మట్టి)ను ఉచితంగా తీసుకునేందుకు రైతులకు అనుమతించామని, అయినప్పటికీ వారికి సైతం కొన్ని షరుతులు విధించామని పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు గుప్తా తెలిపారు. రిజర్వాయర్ ప్రాంతంలో మూడు అడుగుల లోతు వరకు మాత్రమే మట్టిని తవ్వాలని, నల్లమట్టిని పొలాల్లో మాత్రమే వేసుకోవాలని స్పష్టం చేశారు. స్టాక్ చేయడం నిషేధమన్నారు. రిజర్వాయర్ నుంచి ఇసుక, రాళ్లు, మొరం రవాణా చేయొద్దని, మట్టిని తరలించే వాహనాలన్నింటికీ రాష్ట్ర జలవనరుల శాఖ, రెవెన్యూశాఖ, రోడ్లు, భవనాలు, భూగర్భ వనరులశాఖ, మోటార్ వెహికిల్ చట్టం నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే వాల్టా చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మట్టి తరలించేందుకు అనుమతించామని, నిబంధనలను ఉల్లంఘించొద్దని సూచించారు.

