నందిపేట, బతుకమ్మ : కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, నందిపేట మండల కేంద్రంలో ముస్లింలు శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జమే మసీద్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో “పాకిస్తాన్ డౌన్ డౌన్”, “టెరరిజం నాశించాలి”, “ఇండియా జిందాబాద్”, “హిందూ ముస్లిం భాయీ భాయీ” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు, నాయకులు మాట్లాడుతూ—దేశంలో మతసామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, అందులో ముస్లింలు కూడా పూర్తి మద్దతు ఇస్తారని వారు భరోసా ఇచ్చారు. ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసి, ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలపడం విశేషం. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్, అన్ని మసీదు అధ్యక్షులు, కాంగ్రెస్ ముస్లిం నాయకులు జమీల్, ఇసుబ్, ఖదీర్, జావీద్, టీఆర్ఎస్ ముస్లిం నేతలు సయ్యద్ హుస్సేన్, పాషా, హుస్నొద్దిన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, మాజీ ఎంపీటీసీ సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ ఎస్ ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ ని పర్యవేక్షించారు.
15236
