శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం కృషి
’మన్ కీ బాత్‘ లో ప్రధాని మోదీ
డిల్లీ బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లో పెరుగుతున్న పర్యాటకాన్ని చూసి శత్రువులు ఓర్వలేకపోయారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశ్మీర్ ను మరోసారి నాశనం చేయాలనుకున్నారన్నారు. కాశ్మీర్లో శాంతిని స్థాపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ’మన్ కీ బాత్‘ 121 వ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడన్నారు .దేశంలోని ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారని, అదే భారత్లో ఉన్న గొప్పదనం అని కీర్తించారు. జమ్మూ కాశ్మీర్ సాధిస్తున్న అద్భుత పురోగతి చూసి ఓర్వలేకే ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్న వారిని బయటకు లాగుదామని.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారి వెన్ను విరుస్తామని హెచ్చరించారు.
