- ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు
- ఆధునిక సాగుపై సలహాలు, సూచనలు అందించిన శాస్త్రవేత్తలు, నిపుణులు
- విశేషంగా ఆకట్టుకున్న వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్లు
- నూతన సాగు పద్దతులపై అనుభవాలను పంచుకున్న ఆదర్శ రైతులు
- సందేహాలను నివృత్తి చేసుకున్న ఐదు జిల్లాల రైతులు
- కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల సందర్శన
నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం సాయంత్రం నాటితో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా, నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల ఐదు జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130 కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు, వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను

అందించే వంగడాలు, మేలు జాతి పాడిపశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా, రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు మూడు రోజుల పాటు కొనసాగిన వర్క్ షాపులో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఏ.జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు, సస్య రక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంభించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలు తదితర విషయాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలు పంచుకున్నారు.

- స్టాళ్లను సందర్శించిన కలెక్టర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు..
కాగా, చివరి రోజైన బుధవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక, స్టాళ్లను సందర్శించారు. రైతులు, రైతు ప్రతినిధులతో మమేకం అయ్యి మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మహోత్సవ వేడుక నిర్వహించడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. సాగు విషయాలలో అనేక నూతన విధానాలు, సరికొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకోగలిగామని, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలైన అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సైంటిస్టులు, నిపుణులు తమ పరిశోధనా అనుభవాలను, నేటి సామాజిక వ్యవసాయక స్థితిగతులను మేళవిస్తూ అనేక అంశాలపై అవగాహన కల్పించారని, పంటల సాగులో నూతన ఒరవడికి, అధిక దిగుబడుల సాధనకు ఈ మేళా ఎంతగానో దోహదపడుతుందని గట్టి నమ్మకాన్ని వెలిబుచ్చారు.

