- ఇద్దరు మావోయిస్టులు హతం
భద్రాచలం, బతుకమ్మ : ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని నారాయణ్ పూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణ్ పూర్ – కొండగావ్ బార్డర్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఐజీ సుందర్రాజ్ పి నేతృత్వంలో బలగాలు మంగళవారం సాయంత్రం కూంబింగ్ కు దిగాయి. అడవులను జల్లెడ పడుతున్న సమయంలో కిలం–బర్గూం అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ కు మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలపై మావోయిస్టులు మూకుమ్మడిగా కాల్పులకు దిగడంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పులు జరుపుతూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. డివిజన్ కమిటీ సభ్యుడు హల్దర్, ఏరియా కమిటీ మెంబర్ రామేలుగా కనుగొన్నారు. హల్దర్పై రూ.8లక్షలు, రామేపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్రాజ్ పి తెలిపారు. ఏకె–47, ఆటోమెటిక్ వెపన్, ఇతర పేలుడు పదార్ధాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 148 మావోయిస్టులను ఎన్కౌంటర్లలో ఛత్తీస్గఢ్ భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
