కామారెడ్డి, బతుకమ్మ : దేవునిపల్లి శివారులోని టెక్రియాల్ శివారులో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వీర రాఘవయ్య తన కుమారుడి పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో తీసుకురావడానికి తన మిత్రుడితో కలిసి బుధవారం హైదరాబాద్ వెళ్లాడు. తన కుమారుడిని తీసుకుని తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి నిద్రరావడంతో టెక్రియాల్ గ్రామ శివారులోన ఒక దాబ వద్ద ఆగి తన కారులో నిద్రిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు కారు అద్దాలు పగులగొట్టారు. అద్దాలు పగిలిన శబ్దానికి వీరరాఘవయ్యకు మెళుకువ వచ్చి ఎవరు మీరు అని ప్రశ్నించారు. వెంటనే దుండగులు వీర రాఘవయ్య కుమారుని మెడపై కత్తి పెట్టి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే దుండగులు రాఘవయ్య కుమారుడి ల్యాప్ టాప్ ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కారు అద్దాలు పగులగొట్టే సమయంలో రాఘవయ్య ముఖానికి రాయి వచ్చి తగలడంతో గాయాలయ్యాయ. వెంటనే అక్కడి నుంచి బయలు దేరి డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

