నిజామాబాద్, బతుకమ్మ: రేషన్ దుకాణాల్లో స్టాక్ వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వర్ని మండలం జలాల్ పూర్ లోని రేషన్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రతా కార్డులు కలిగి ఉన్నాయి, ఇప్పటివరకు ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయ్యింది, ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాల గురించి రేషన్ డీలర్ కాశీరాంను ప్రశ్నించి, స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. రేషన్ షాపులోని బియ్యం నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.

