ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
ముగ్గురు చిన్నారుల మృతి, తల్లి పరిస్థితి విషమం
వెబ్ న్యూస్, బతుకమ్మ: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. అమీన్ పూర్ లోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, ఆయన భార్య రజిత, వారి పిల్లలు సాయికృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) నివాసముంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భార్య భర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు. భోజనం తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి రాగా రజిత తలుపులు తెరవగా.. పిల్లలు నిద్రపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంతో రజితకు తీవ్రమైన కడపునొప్పి రావడంతో స్థానికుల సహాయంతో చెన్నయ్య ఆమెను ఓ ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించాడు. ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా.. ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. చెన్నయ్యది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి కోసం వచ్చిన చెన్నయ్య కొంత కాలంగా అమీన్ పూర్ లో ఉంటున్నాడు. చిన్నారుల మృతి పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
