నిజామాబాద్, బతుకమ్మ: ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చెయ్యకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టిన ఎమ్మర్పీఎస్ నిరసన దీక్షలు నాలుగు రోజుకు చేరాయి. వీహెచ్ పీఎస్ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్ పీఎస్) జిల్లా కమిటీ నాయకులు సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ.. తెలంగాణలో సమస్త ప్రజలు, కులాలు హోలీ పండుగ సంబరాల్లో ఉంటే మాదిగ జాతి మాత్రమే తమ హక్కుల కోసం నిరసనలు, ఉద్యమాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఒకవైపు మాలలు ఉద్యోగాలు సాధిస్తూ పండగ జరుపుకుంటుంటే, మరోవైపు మాదిగలు అవే ఉద్యోగాల కోసం నిరసనలు తెలుపుతున్నారని, మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మాదిగలు కోరుకునే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టకుండా తాత్సారం చేస్తే మాదిగల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపెడుతామని హెచ్చరిస్తున్నామన్నారు.
ఎమ్మార్పీఎస్ దీక్షకు జర్నలిస్టులు రామకృష్ణ, దశరథ్ సంఘీభావం తెలిపారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు సత్తెక్క, జిల్లా నాయకురాలు స్వప్న మాదిగ, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షుడు మహేశ్ మాదిగ, వీహెచ్ పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం, జిల్లా మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు ప్రశాంత్, పోతన్న తదితరులు పాల్గొన్నారు.

