నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో హోటళ్ళ నిర్వాహణ కోసం రాత్రి 12 గంటల వరకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ హోటల్, రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరంలో రాత్రి 10:30కే హోటళ్ళను, రెస్టారెంట్లను మూసివేయాలని వచ్చిన ఉత్తర్వుల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని వారు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం లేకుండాపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. నగరంలో శాంతిభద్రతల విషయంలో ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో హోటళ్ళను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే విషయంపై అధికార యంత్రాంగంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికార యంత్రాంగంతో మాట్లాడి హోటళ్ళ నిర్వాహణ సమయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో అధ్యక్షులు గంగారెడ్డి, ఉపాధ్యక్షులు అక్బర్ ఆలీ, ప్రధానకార్యదర్శి సంపత్ రెడ్డి, కోశాధికారి సుమన్, సంయుక్త కార్యదర్శి మహ్మద్ ఆలీ తదితరులున్నారు.
