రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో గల బస్టాండ్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని, ఈ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం జవహర్ నగర్ కాలనీవాసులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యుటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గంగాధర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జేయన్సీ బస్టాండ్ ను 2005 వ సంవత్సరంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ బస్టాండ్ శిథిలావస్థలో ఉంది. దీనిని అదునుగా తీసుకొని ప్రక్కన గల మైనార్టీ షాదిఖాన వారు ఈ బస్టాండ్ స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారన్నారు. కావున విషయం పై మేమందరము కలిసి వారిని అడగగా ఈ విషయాన్ని హిందూ ముస్లీం ఫీలింగ్ వచ్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తమరు రికార్డు ప్రకారం 2005 సంవత్సరంలో ప్రజా ప్రతినిధులు ఇట్టి బస్టాండ్ కొరకు 30 ఫీట్లు పొడవు, 30 ఫీట్లు వెడల్పు తో కూడిన ప్లాటు కేటాయించడం జరిగింది. అప్పటి సంస్కార్ ప్లాన్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యలో 2005 సంవత్సరంలో బస్టాండ్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ బస్టాండ్ ను ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారన్నారు. బస్టాండ్ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని జవహర్ నగర్ కాలనీ ప్రజలకు న్యాయం చేసి బస్టాండ్ స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రాన్ని అందించిన వారిలో జవహర్ నగర్ కాలనీవాసులు గణేష్, రవి, భాస్కర్, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.
