- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
రాజంపేట, బతుకమ్మ : రాజంపేట మండలంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పలు బాధిత కుటుంబాలను గురువారం పరామర్శించారు. మండలంలోని బసవన్నపల్లి,ఆర్గొండ, కొండాపూర్, గుండారం, సిద్దాపూర్, ఎల్లారెడ్డిపల్లి, ఎల్లారెడ్డి పల్లి తండా గ్రామాలలో ఇటీవల ప్రమాదాల బారిన పడి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో ఉండి ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వ హాయంలో మన ఊరి మనబడి కార్యక్రమంలో నిధులు లేక పనులు ఆగిపోయాయని త్వరలోనే పెండింగ్ బిల్లులు వచ్చేందుకు అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని దశలవారీగా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. స్థానిక ఎన్నికలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. స్థానిక ఎన్నికలలో ప్రభుత్వ నిర్ణయాన్ని కట్టుబడి స్థానిక ఎన్నికలకు వెళ్తామని బీసీ గణన మరియు ఏసీ వర్గీకరణ రిజర్వేషన్ల ప్రక్రియ

పూర్తికాగానే ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని ఈ విషయంపై క్యాబినెట్లో చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వెనుకబాటులో ఉందని అభివృద్ధి దిశలో నడిపేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. గత కొంత కాలంగా ఎల్లారెడ్డి బస్సు డిపో ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ఇప్పటికే మూడుసార్లు మంత్రిని కలిశానని ఒకసారి అసెంబ్లీలో ప్రస్తావించానని సానుకూల స్పందన వచ్చిందని తన చిరకాల వాంఛ బస్సు డిపో ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. కొండాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు సైతం మంత్రితో మాట్లాడానని బడ్జెట్ కారణంగా జాప్యం జరుగుతుందని వివరించారు. రాజంపేట మండలంలో పోడు భూముల సమస్య ఉన్నదని ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహంతో గిరిజనులకు ఇబ్బందులు పెడుతున్నారని గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చిందని ఇప్పుడేమో సాగు చేయడానికి వెళ్తే ఇబ్బందులు పెడుతున్నారని ఈ విషయం తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. పోడు భూములకు సైతం తాను రైతు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశానని ఆ దిశ మేరకే రైతు భరోసా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని అన్నారు. వచ్చే అసెంబ్లీలో సైతం నియోజకవర్గ సమస్యలను వివరించి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర పనిత్ రెడ్డి నాయకులు బీరయ్య,సల్మాన్, శ్రీధర్ హాజినాయక్,బన్సీలాల్, సంతోష్ రెడ్డి,సంజీవరెడ్డి, బాలరాజ్,సాయ గౌడ్,శ్యామయ్య, మధు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
