. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు
. రాజకీయ కక్షలను పక్కనపెట్టి రైతులకు నీళ్లివ్వండి
. తప్పుడు లెక్కలపై బీసీ సమాజం అట్టుడుకుతోంది
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాల, బతుకమ్మ: ఐఫోన్ లా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో చైనా ఫోన్ లా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని, రాజకీయ కక్షలను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని సూచించారు. రైతులు ఎండిపోయిన పొలాలను చూపిస్తూ బాధపడుతున్నారన్నారు. బీసీలను బురిడీ కొట్టించి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తూతూ మంత్రంగా బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని, సీఎం ఎందుకు సమావేశం కావడం లేదన్నారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో సీఎం మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమేనని అన్నారు. 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను వంచించిందని విమర్శించారు. ఆడ పిల్లలకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరినప్పటికీ కార్యకర్తల మనోధైర్యం చెక్కు చెదరలేదని, ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.
