నందిపేట్, బతుకమ్మ : నందిపేట్_డొంకేశ్వర్ మండలలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆనంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ, రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మండల అభివృద్ధి అధికారి (ఎండీవో) కార్యాలయంలో ఏం డి ఓ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి పతాకావిష్కరణ చేసి,మండల విద్యాధికారి (ఎంఇఓ) కార్యాలయంలో ఎంఇఓ, వ్యవసాయ కార్యాలయం లో వ్యవసాయ అధికారిని జాతీయ పతాకాన్ని ఎగురవేసి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మరియు ఆధునిక పద్ధతుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు పతాకావిష్కరణ నిర్వహించి, విద్యార్థులతో కలిసి దేశభక్తి పాటలు ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ప్రసంగాలు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల విద్యార్థులు ఉదయం నుంచే ర్యాలీలు నిర్వహించి “జై జవాన్, జై కిసాన్” నినాదాలతో మండలాన్ని మారుమ్రోగించారు. ఈ వేడుకల్లో మండలంలోని వివిధ కార్యాలయాల సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొని దేశభక్తిని ప్రదర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పదవుల లో లేకపోవడం వలన వారి లోటు స్పష్టంగా కనిపించింది.
