- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కోప్పిశెట్టి కి వినతి
మద్నూర్, బతుకమ్మ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోయా పంటకు మద్దతు ధర రూ.4,892 ప్రకటిస్తూ మద్నూర్ మార్కెట్ యార్డులో మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకు పంట కొనుగోలు జరిపి పూర్తిగా నిలిపివేశారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతుల పంట దాదాపు 5వేల నుండి పదివేల క్వింటాళ్ల వరకు అలాగే ఉండిపోవడంతో గురువారం మార్కెట్ యార్డులో రైతులు రోడ్డెక్కి రాస్తారోకో ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సబ్ కలెక్టర్ హుటా హుటిన మద్నూర్ సందర్శించి తాహసిల్దార్ కార్యాలయంలో రైతులతో చర్చించారు. మద్నూర్ మార్కెట్ యార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో జరిగిన సోయా పంట మద్దతు ధర కొనుగోళ్లపై సబ్ కలెక్టర్ ఆరా తీశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ పంటను కొనుగోలు జరిపించాలని జాతీయ రహదారిపై రాస్తారోకో ఆందోళన చేపట్టారు. రైతులు సబ్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

