నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, మత కల్లోలాలు, దాడులను ప్రోత్సహించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువతకు శిక్షణ ఇచ్చిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( పీఎఫ్ఐ) కీలక సభ్యుడు అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లికి చెందిన అబ్దుల్ అహద్ అలియాస్ అహద్ 2023 నుంచి పరారీలో ఉన్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఖదీర్ తో కలిసి పీఎఫ్ఐ కార్యకలపాలను విస్తరించేందుకు యువతకు శిక్షణ ఇవ్వడంతో నిజామాబాద్ ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిషేధిత పీఎఫ్ఐ మూలాలు నిజామాబాద్ లో వెలుగు చూడటంతో ఎన్ఐఏ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అనాటి నుంచి అహద్ పరారీలో ఉండగా బుదవారం నాంపల్లి కోర్టులో లోంగిపోయినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో కీలక సూత్రధారులు పట్టుబడగా రెండు సంవత్సరాలుగా అహద్ కోసం ఎన్ఐఏ తో పాటు లోకల్ పోలీసులు గాలిస్తున్నారు. అహద్ అచూకీ కోసం ఎన్ఐఏ లుక్ అవుట్ నోటీస్ కుడా జారీ చేసింది. అహద్ సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ప్రకటించడం గమనార్హం. అహద్ ను ఎన్ఐఏ విచారించే అవకాశం ఉంది.
